కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కార్ నుంచి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు మరోసారి చుక్కెదురైంది. జాదవ్‌పూర్‌లో అమిత్ షా నిర్వహించతలపెట్టిన రోడ్ షోకు పశ్చిమ బెంగాల్ సర్కార్ అనుమతి నిరాకరించింది. అంతేకాకుండా అమిత్ షా హెలీక్యాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన అనుమతిని సైతం ఆ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. జాదవ్‌పూర్‌లోనే కాకుండా కోల్‌కతా, నార్త్ 24 పర్గనాస్‌లోనూ బీజేపి తలపెట్టిన ఎన్నికల ర్యాలీలకు అమిత్ షా హాజరు కావాల్సి ఉంది. 


కోల్‌కతాలోని కనింగ్, రాజర్‌హట్‌లలో అమిత్ షా ర్యాలీలకు అనుమతి ఇచ్చిన పశ్చిమ బెంగాల్ సర్కార్.. బరుయిపూర్ సభకు అమిత్ షా హెలీక్యాప్టర్ ల్యాండింగ్‌కి అవసరమైన అనుమతిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. బరుయిపూర్ సభకు అమిత్ షా హెలీక్యాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు అక్కడి ప్రైవేటు స్థలం యజమాని నుంచి అనుమతి పొందినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.