రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట మరో పెళ్లి బాజా మోగనుందా? మంగళవారం ఉదయం నుంచి సోషల్ మీడియాల్లో ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొడుతుండటంతో వారి ఎంగేజ్‌మెంట్ జరిగిపోయిందని, డిసెంబరులోనే పెళ్లి అంటూ వార్తలొస్తున్నాయి. అయితే దీన్ని రిలయన్స్‌ ప్రతినిధి ఒకరు కొట్టిపారేశారు. ‘నిశ్చితార్థం జరగలేదు, అవన్నీ పుకార్లే’ అని అన్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఇటీవలే ఆకాశ్‌ అంబానీ-శ్లోకా మెహతా, ఈశా అంబానీ-ఆనంద్‌ పిరమాల్‌ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లిళ్లు డిసెంబరులో జరుగుతాయని ఇప్పటికే ప్రకటించారు.


ఈశా అంబానీ-ఆనంద్‌ పిరమాల్‌


చిరకాల స్నేహితులైన ఆనంద్ పిరమల్‌- ఈశా నిశ్చితార్థం గతవారం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త అజయ్ పిరమల్ కుమారుడైన ఆనంద్ పిరమల్‌ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్. ప్రస్తుతం పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సైకాలజీలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న ఈశా యేల్ విశ్వవిద్యాలయంలో సౌత్ ఏషియన్ స్టడీస్ పూర్తిచేశారు. ప్రస్తుతం రిలయన్స్ జియోతో పాటు రిలయన్స్ రిటైల్ బోర్డుల్లో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.


ఆకాశ్‌ అంబానీ-శ్లోకా మెహతా


చిన్ననాటి స్నేహితులైన ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతా నిశ్చితార్థం ఇటీవలే జరిగింది. వజ్రాల వ్యాపారి రోజీ బ్లూ డైమండ్స్ అధిపతి రసెల్ మెహతా చిన్నకుమార్తె శ్లోకా మెహతా. ఈమె ప్రిన్స్ టన్ వర్సిటీలో అంత్రోపాలజీలో డిగ్రీ, ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి లాలో మాస్టర్స్ పూర్తి చేశారు. రోజీ బ్లూ స్వచ్ఛంద సంస్థలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కనెక్ట్ ఫర్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలు కూడా. ఆకాశ్ అంబానీ బ్రౌన్ వర్సిటీలో అర్థశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆకాష్ రిలయన్స్ జియో బోర్డులో ఉన్నారు.