సిమెంట్ లోడ్ లారీ బోల్తా: 19 మంది మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
రక్తమోడిన భావ్నగర్-అహ్మెదాబాద్ హైవే
సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాకొట్టిన ఘటనలో 19 మంది మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. గుజరాత్లోని భావ్నగర్-అహ్మెదాబాద్ హైవేపై శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భావ్నగర్లోని బవల్యాలి గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకున్న పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టింది. సిమెంట్ బస్తాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసిన సిబ్బంది, గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఇతర క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులలోనూ పలువురి పరిస్థితి విషమంగా వుందని అక్కడి అధికారవర్గాలు తెలిపాయి. అతివేగమే ఈ దుర్ఘటనకు కారణం అని ప్రాథమిక నివేదిక చెబుతున్నప్పటికీ, అసలు కారణం ఇంకా తెలియాల్సి వుంది.