వాట్సాప్ ద్వారా చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రోత్సహిస్తోన్న ఓ వాట్సాప్ గ్రూప్ గుట్టురట్టు చేసిన సీబీఐ, ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ని అరెస్ట్ చేయడంతోపాటు మరో ఐదుగురు అడ్మిన్స్‌పై కేసు నమోదు చేసింది. అడ్మిన్స్‌తోపాటు ఈ గ్రూప్‌లో సభ్యులుగా వున్న 114 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ గ్రూప్ సభ్యుల్లో ఏడు దేశాలకు చెందిన వారు వున్నారు. అరెస్ట్ అయిన అడ్మిన్‌ని ఉత్తర్ ప్రదేశ్‌లోని కనౌజ్‌కి చెందిన నిఖిల్ వర్మ (20) గా గుర్తించారు. నిఖిల్ వర్మని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వద్ద నుంచి ఓ ల్యాప్‌టాప్, మొబైల్, హార్డ్ డిస్కులని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించడం కోసం దర్యాప్తు బృందం ఢిల్లీ, నొయిడాల్లో తనిఖీలు జరిపింది. గత రెండేళ్లుగా యాక్టివ్‌గా వున్న ఈ వాట్సాప్ గ్రూప్‌లో చైనా, పాకిస్థాన్, అమెరికా, బ్రెజిల్, అఫ్ఘనిస్థాన్, కెన్యా, నైజీరియా, శ్రీలంక దేశాల నుంచి మొత్తం 199 మంది సభ్యులు కొనసాగుతున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. 


ఈ గ్రూప్ ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్లపై చర్యలు తీసుకోవడానికి వీలుగా ఆ ఏడు దేశాల్లో కీలకమైన దర్యాప్తు సంస్థలను సంప్రదిస్తున్నట్టు పోలీసులు స్పష్టంచేశారు. ఈ కేసులో నిందితులుగా వున్న అడ్మినిస్ట్రేటర్స్‌తోపాటు సభ్యులని గుర్తించే పనిలో తలమునకలైన పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు.. వీళ్ల బారిన పడిన బాధితులపై ఇంకా ఫోకస్ చేయలేదు. ఈ వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులు అసంబద్ధమైన వీడియోలు, సమాచారం పంచుకున్నట్టుగా గుర్తించిన ఇంటెలీజెన్సీ వర్గాలు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో వీళ్ల బాగోతం వెలుగుచూసింది.