న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో ఉత్తర్‌ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీని ‘మోదీ సేన’గా అభివర్ణించడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుపడుతూ ఆయన్ని మందలించిన సంగతి తెలిసిందే. బాధ్యాతయుతమైన పదవిలో వున్న మీరు ఇకపై మాట్లాడేముందు కాస్త ఆచితూచి వ్యవహరించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం యోగి ఆదిత్యనాథ్‌ను హెచ్చరించింది. మోదీ గారి సేన వ్యాఖ్యల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఎన్నికల సంఘం ఈమేరకు ఆయనకు సున్నితంగానే వార్నింగ్ ఇచ్చింది.


అయితే, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన యోగి ఆదిత్యనాథ్‌ను ఎన్నికల సంఘం అలా ఎలా వదిలేసిందని ప్రశ్నించిన కాంగ్రెస్.. యోగిని చూసి ఎన్నికల సంఘం భయపడినట్టు అనిపిస్తోందని ఆరోపించింది. యోగి ఆదిత్యనాథ్‌ని ఎన్నికల సంఘం మందలించిన తీరు చూస్తే, ఆయనకు ఏదో ప్రేమ లేఖ రాసినట్టుగా ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిథి రణ్‌దీప్ సింగ్ సుర్జెవాలా ఎద్దేవా చేశారు.