న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ ఘటన కేసులో ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దోషులకు మరణశిక్ష తేదీని కోర్టు ఖరారు చేసింది. జనవరి 22వ తేదీన ఆ కామాంధులకు మరణశిక్షను అమలు చేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. ఆ రోజు ఉదయం 7 గంటలకు నిందితులను ఉరితీయాలని సమయాన్ని సైతం కోర్టు సూచించింది. తాజా తీర్పుపై క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు దోషులు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్‌ ఠాకూర్ లకు పాటియాలా కోర్టు 14 రోజలు గడువు ఇచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు ఆ రోజు ఏం జరిగింది?


దక్షిణ ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న రాత్రి సమయంలో నిర్భయ ద్వారకలోని ఇంటికి వెళ్లాలనుకుంది. ఆటో కోసం చూస్తున్న నిర్భయ, ఆమె స్నేహితుడు అరవింద ప్రతాప్ పాండే ప్రైవేట్ బస్సు కనిపించగా అందులో ఎక్కారు. అప్పటికే అందులో ఆరుగురు మగాళ్లున్నారు. కొంతదూరం వెళ్లాక బస్సును దారి మళ్లించారు. ప్రశ్నించగా నిర్భయ స్నేహితుడు అరవింద్‌ను రాడ్డుతో కొట్టగా స్పృహ తప్పాడు.


బస్సు డోర్ లాక్ చేసిన ఆ నిందితులు నిర్భయను వెనుక సీట్లోకి ఈడ్చుకెళ్లారు. మద్యంమత్తులో ఉన్న ఆరుగురు ఒకరి తర్వాత ఒకరు నిర్భయపై అత్యాచారం చేశారు. వారిని అడ్డుకునేందుకు యత్నించిన నిర్భయను చిత్రహింసలకు గురిచేశారు. అత్యాచారాన్ని ప్రతిఘటించాలని యత్నించిన బాధితురాలిపై భౌతికదాడులకు పాల్పడ్డారు. మరింత రెచ్చిపోయిన ఆ కామాంధులు అత్యాచారం చేసిన తర్వాత తుప్పుపట్టిన ఇనుపరాడ్డును నిర్భయ మర్మావయాల్లోకి జొప్పించి పైశాచిక ఆనందం పొందారు. 


Also Read: నిర్భయ కేసు దోషులకు ఉరి శిక్ష తేదీ ఖరారు


హీనమైన ఆ దాడి ఘటనలో నిర్భయ జననాంగాలు ఛిద్రమయ్యాయి. చివరకు నగ్నంగా, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నిర్భయను, ఆమె స్నేహితుడిని బస్సు నుంచి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. అరవింద్ ఆ భయానక ఘటన వివరాలను పోలీసులకు వివరించాడు. కానీ మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌కు తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది. అక్కడ రెండు రోజుల చికిత్స తర్వాత ఆమె కన్నుమూసింది.


అత్యాచారం, హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను విచారించారు. నిందితులలో ఒకరు మైనర్ కాగా, మూడేళ్ల శిక్ష విధిస్తూ జువైనల్ హోంకు తరలించారు. మూడేళ్ల తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు. కేసు విచారణలో ఉండగా.. బస్సు డ్రైవర్ రామ్ సింగ్ తిహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. మిగతా నలుగురు నిందితులు ముకేశ్, పవన్ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్, వినయ్ శర్మలకు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. తాజాగా పటియాలా కోర్టు నలుగురు దోషులకు జనవరి 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని తీర్పు వెల్లడించింది.


2012లో డిసెంబర్ నెలలో ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం, హత్య ఘటన కేసులో నిందితులకు మరణశిక్ష త్వరగా అమలు చేయాలిని బాధితురాలి తల్లిదండ్రులు పాటియాలా కోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం దోషులకు మరణశిక్షను ఇక ఆలస్యం చేయరాదని, జనవరి 22న నలుగురు దోషులను ఉరి తీయాలని తీర్పులో పేర్కొంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..