న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 'రేప్ ఇన్ ఇండియా'(Rape in India remarks) వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించాలని ఝార్ఖండ్ ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. మేక్ ఇన్ ఇండియా(Make in India) కార్యక్రమాన్ని.. దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలకు ముడిపెడుతూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై బీజేపీ భగ్గుమంది. ఈ విషయంలో పార్లమెంట్ ఉభయ సభల్లో అధికార పార్టీకి చెందిన మహిళా ఎంపీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) మరో అడుగు ముందుకు వేసి... కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల ఆధారంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఝార్ఖండ్‌లోని గొడ్డాలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా..'రేప్ ఇన్ ఇండియా'  అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల సీడీని సమర్పించారు. స్మృతి ఇరానీ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం... అసలేం జరిగిందో... ఓ నివేదిక సమర్పించాలని ఝూర్ఖండ్ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : క్షమాపణలు చెప్పేదే లేదు.. ప్రధాని మోదీనే చెప్పాలి: రాహుల్ గాంధీ


వెనక్కి తగ్గని రాహుల్...
మరోవైపు రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలపై ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పేది లేదంటూ ట్వీట్ చేశారు. పైగా దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ప్రధాని మోదీనే దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు బీజేపీ ఇలాంటి కుట్రలు చేస్తోందంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు.


Read also : రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా: రంజిత్ సావర్కర్