శ్రీనగర్: జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి భద్రతా బలగాలపై దాడికి తెగబడ్డారు. పుల్వామా జిల్లా పింగ్లన్ ప్రాంతంలో 55 రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన జవాన్లు, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మేజర్ సహా మొత్తం నలుగురు సైనికులు మృతిచెందారు. గురువారం నాడు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి జరిగిన స్థలానికి మరో 10 కిమీ దూరంలోనే ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇద్దరు లేక ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు తలదాచుకుని ఉండి ఉంటారని భావిస్తున్న భద్రతా బలగాలు ఇప్పటికే ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టి జల్లెడ పడుతున్నాయి. 


జీ న్యూస్ ప్రతినిథి మనిష్ శుక్లా వెల్లడించిన వివరాల ప్రకారం కడపటి వార్తలు అందే సమయానికి సైనికులు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతూనే వున్నాయని తెలుస్తోంది.