బీజేపీ నేత వరుణ్ గాంధీ ఓ సెమినార్లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'నేను రెండు సార్లు ఎంపీగా గెలిచానంటే అందుకు కారణం.. నా పేరులో 'గాంధీ' ఉండడమేనని' ఆయన  అభిప్రాయపడ్డారు. నేటికీ వారసత్వ రాజకీయాలు అనేవి కొనసాగుతున్నానని తాను భావిస్తున్నానని.. అందుకే సాధారణ యువత రాజకీయాల్లోకి రావాలనుకున్నా.. వారికి అవకాశాలు దక్కడం లేదని వరుణ్ గాంధీ తెలిపారు. "మంచి తెలివితేటలు, హుందాతనం, నాయకత్వ లక్షణాలు ఉండి కూడా ఎందరో యువకులు రాజకీయ నేపథ్యం ఉన్న తండ్రులు లేదా సమర్థకులు లేకపోవడం వల్లే రాజకీయాల్లోకి రాలేకపోతున్నారని.. ఈ పరిస్థితి మారాలని" తాను అనుకుంటున్నానని వరుణ్ గాంధీ అన్నారు.


ఒక సామాన్యుడు లేదా రైతు గానీ బ్యాంకుకి రూ.25,000 బాకీ గనుక ఉండి తీర్చలేకపోతే జైలుకి పంపిస్తారని.. అదే ధనవంతుడు బ్యాంకుకి డబ్బులు ఎగ్గొట్టి తమ పిల్లల పెళ్లి్ళ్లలను రంగ రంగ వైభవంగా జరిపినా ఎవరూ పట్టించుకోరని వరుణ్ తెలిపారు. ఈ విధంగా చూస్తే.. భారతదేశంలో ఐకమత్యమనేది ప్రజల్లో లేదని తాను ఇప్పటికీ భావిస్తానని వరుణ్ గాంధీ అభిప్రాయపడ్డారు. భారతదేశంలో పేదలకు, ధనికులకు సమన్యాయం జరగనప్పుడు మనం కలలు గన్న భారతాన్ని ఎప్పటికీ చూడలేమని వరుణ్ గాంధీ తెలిపారు.