పాట్నా: వేసవిలో పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలు వృద్ధులు, చిన్నారులపాలిట శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో ఎండలు మండుతున్నాయి. బీహార్‌లో వడగాల్పుల కారణంగా వడదెబ్బ తగిలి ఇప్పటివరకు 130 మంది మృతి చెందిన వైనం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. అత్యధికంగా ఔరంగబాద్‌లో 60 మంది, గయలో 35, నలంద-12, నవడ-12, ముంగర్‌లో 5, కైమూర్-2, వైశాలి-2, ఆరాలో ఒకరు, సమస్తిపూర్‌లో ఒకరు వడగాల్పుల కారణంగా మృతిచెందారు. దీంతో అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా జూన్ 22 వరకు అన్ని పాఠశాల, కళాశాల స్థాయి విద్యా సంస్థలకు బీహార్ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. 


పాట్నా, గయ, భగల్‌పూర్ వంటి నగరాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గయలో అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా జిల్లాలో 144 సెక్షన్ విధిస్తున్నట్టు జిల్లా మెజిస్ట్రేట్ స్పష్టంచేశారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఎవ్వరూ ఇళ్లలోంచి బయటకు రాకూడదని జిల్లా మెజిస్ట్రేట్ సూచించారు.