ముంబై: ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల జమ్మూకాశ్మీర్‌లో మరెన్నో పుల్వామా తరహా దాడులకు దారితీసే పరిస్థితులు తలెత్తుతాయని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలే పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని స్పష్టంచేస్తున్నాయని శివ సేన ఆరోపించింది. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలి తీసుకున్న పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందనడానికి ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలే నిదర్శనం అని శివసేన పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు తెంచుకోవడంతోపాటు ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిపేసే దిశగా పాకిస్తాన్ అడుగులేయడం అనేది ఆ దేశానికే నష్టం తప్ప భారత్‌కి కాదని శివ సేన అభిప్రాయపడింది. తమ అధికారిక పత్రిక సామ్నాలో ప్రచురించిన సంపాదకీయ కథనంలో శివ సేన ఈ వ్యాఖ్యలు చేసింది.


పాకిస్తాన్‌లో విధులు నిర్వహిస్తోన్న భారత హై కమిషనర్‌ని వెనక్కి పంపడంతోపాటు పాకిస్తాన్ హై కమిషనర్‌ని భారత్‌కి పంపకపోవడం వంటి పరిణామాలను శివసేన స్వాగతిస్తున్నట్టు సామ్నా పేర్కొంది.