హైదరాబాద్‌: రాయితీపై రైలు టికెట్లు పొందేవారికి టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని మరింత సులభతరం చేస్తున్నట్టు ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ప్రకటించింది. ఇప్పటివరకు అమలులో వున్న నిబంధనల ప్రకారం టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లలోనే రాయితీని పొందుతుండగా ఇకపై ఐఆర్‌సీటీసీకి సంబంధించిన ఈ-టికెటింగ్‌ వెబ్‌సైట్‌ ద్వారా కూడా రాయితీపై టికెట్స్ పొందే అవకాశం కల్పించినట్టు ఐఆర్‌సిటిసి పేర్కొంది. 


వృద్ధులు, దివ్యాంగులు, డాక్టర్లు, క్రీడాకారులు, విద్యార్థులు, యుద్ధంలో భర్తను కోల్పోయిన మహిళలు వంటి వారికి టికెట్‌ ధరల్లో రాయితీ లభిస్తోంది. అంతేకాకుండా 58 ఏళ్లు లేదా ఆపైన వయసున్న మహిళలకు టికెట్‌ ధరల్లో 50 శాతం, 60 ఏళ్లు లేదా ఆపై వయసున్న పురుషులకు 40 శాతం రాయితీని ఐఆర్‌సిటిసి అందించనుంది. అన్నిరకాల తరగతుల ప్రయాణాలకు ఈ రాయితీలు వర్తిస్తాయి.