ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును జూలై 31 నుంచి ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్) గురువారం ప్రకటించింది. 2018-19 సంవత్సరానికిగాను ఆడిట్‌ అవసరంలేని పన్ను చెల్లింపుదారులు ఆగస్టు 31వ తేదీ వరకు ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసుకోవచ్చని ఆదాయ పన్ను శాఖ స్పష్టంచేసింది. ఇదివరకు ఈ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే గడువు జూలై 31 వరకు మాత్రమే ఉండటంతో సమయాభావం వల్ల ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వీలు కాని ఉద్యోగులకు ఈ వార్త ఊరటనిచ్చింది.