బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారంలో విషాదం చోటుచేసుకుంది. జయనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీఎన్ విజయ్ కుమార్ (60) గుండెపోటుతో మృతి చెందారు. బెంగళూరులోని జయనగర్, పట్టాభిరామనగర్ ప్రాంతాల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో విజయ్ కుమార్‌కు తీవ్ర గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోగా.. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు.


అయితే, చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈ మేరకు కర్ణాటక బీజేపీ ఓ ట్వీట్ చేసింది. పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని, విజయకుమార్ మృతితో పార్టీకి తీరని నష్టం కలిగిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొంది. కాగా, అవివాహితుడైన విజయ్ కుమార్ బీజేపీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.