అప్పుగా ఇచ్చిన రూ.40 లక్షల సొమ్మును తిరిగి ఇవ్వమని అడిగినందుకు.. తన బిజినెస్ పార్టనర్‌నే అతి కిరాతకంగా హతమార్చాడు ఓ వ్యక్తి. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగేందుకు ఇంటికొచ్చిన జస్కరణ్ సింగ్ అనే బిజినెస్ పార్టనర్‌ని తన భార్య, మరో స్నేహితుడి సహాయంతో బంధించి హతమార్చడమే కాకుండా అతడి శవాన్ని 24-25 ముక్కలు చేశాడు. హత్య అనంతరం ఆనవాళ్లు లేకుండా చేసేందుకు తన సొంత గ్రామమైన లుధియానాకు కారులో బయల్దేరి వెళ్తూ.. దారిలో నిర్మానుష్యమైన ప్రాంతాల్లో అక్కడక్కడా మృతదేహం అవయవాలను విసిరేస్తూ వెళ్లిపోయాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబర్ 14న ఢిల్లీ శివార్లలోని గురుగావ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అక్టోబర్ 22న లుధియానా నుంచి గురుగావ్‌కి తిరిగొచ్చిన అనంతరం ఇక పోలీసుల నుంచి తప్పించుకోవడం కష్టం అని భావించిన నిందితుడు హర్నెక్ సింగ్.. భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు పథకం రచించాడు. అయితే, ఆమె ఆత్మహత్యకు అంగీకరించకపోవడంతో.. ఆమె గొంతు కోసి హత్యచేశాడు. అనంతరం తాను కూడా అదే కత్తితో గాయాలు చేసుకుని మరో కొత్త నాటకానికి తెరతీశాడు. ఇంట్లోకి చొరబడిన దోపిడీ దొంగలు తన భార్యను హతమార్చి, సొమ్మును దొంగిలించినట్టు పోలీసులకు కట్టు కథ చెప్పాడు.


అయితే, నీ భార్యను హత్యచేసిన దోపిడీ దొంగలు నిన్ను మాత్రం గాయపర్చి ఎందుకు వదిలేశారని పోలీసులు అడిగిన ప్రశ్నకు హర్నెక్ సింగ్ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదు. దీంతో హర్నెక్ సింగ్ వైఖరిపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని తమదైన స్టైల్లో ప్రశ్నించగా అసలు నేరాన్ని అంగీకరించాడు. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో బిజినెస్ పార్టనర్ జస్కరణ్ సింగ్‌ని హతమార్చింది మొదలుకుని, ఆత్మహత్యకు నిరాకరించిన తన భార్యను హత్యచేసిన వరకు అన్ని విషయాలను పూసగుచ్చినట్టు వివరించాడని గురుగావ్ పోలీసు స్టేషన్ పీఆర్వో సుభాష్ బొకన్ తెలిపారు.