న్యూఢిల్లీ : 71వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని 2020వ సంవత్సరానికిగాను శనివారం కేంద్ర ప్రభుత్వం ఉన్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందిని కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులకు ఎంపిక చేసినట్టు తమ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డుగ్రహీతలకు అవార్డులు అందజేయనున్నారు. ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరిని ఈ పద్మ అవార్డులు వరించాయి. 


తెలంగాణ నుంచి క్రీడా విభాగంలో పీవీ సింధుకు పద్మ భూషణ్‌ను ప్రకటించగా.. వ్యవసాయ రంగంలో తెలంగాణకు చెందిన చింతల వెంకట్ రెడ్డికి పద్మశ్రీ , విద్య-సాహిత్య రంగాల్లో విశేష సేవలు అందించిన విజయసారధి శ్రీభాష్యంకు పద్మశ్రీ అవార్డు వరించాయి. కళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యడ్ల గోపాల రావు, దలవాయి చలపతి రావులకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.