ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లుగా ఉంది పరిస్థితి. అమెరికా, ఇరాన్ మధ్య పంచాయతీ భారత్ మీదకొస్తోంది. అమెరికా , ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం కారణంగా పెట్రో రేట్లు పరుగు తీస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. నిన్నటికి నిన్న పెట్రోల్ పై లీటర్ కు 9 పైసలు, డీజిల్ పై 11 పైసలు పెరుగుదల కనిపించింది. బాగ్దాద్ విమానాశ్రయంపై అమెరికా డ్రోన్ దాడి తర్వాత పెట్రో రేట్లు పెరగడం ఇది ఐదోసారి.  పెట్రో రేట్ల పెరుగుదల వల్ల దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర   రూ. 75.54 పైసలకు చేరింది. అలాగే డీజిల్  ధర లీటర్ కు రూ.68.51 పైసలకు చేరుకుంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.80.50 పైసలకు చేరింది. లీటర్ డీజిల్ దర రూ. 74.88 పైసలకు చేరింది.  


ఐదు రోజులు వరుసగా పెట్రోల్ ధరలు పెరగడంపై సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. నిత్యం పెరుగుతున్న పెట్రో రేట్లతో జీవితంపై మరింత భారం పడుతుందని చెబుతున్నారు. ఇలాగే ఇంధన ధరలు పెరుగుతూ పోతే సరుకు రవాణాపై భారం పడుతుంది. దీంతో ఆ ప్రభావం నిత్యావసర వస్తువులపైనా కనిపిస్తుంది. ఫలితంగా నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..