భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులు సొంతం చేసుకున్న అవార్డు గ్రహీతలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో పురస్కారాలతో సత్కరించారు. 2018 ఏడాదికిగాను 85 మందికి గతంలోనే భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న వారిలో సంగీత దర్శకుడు ఇళయరాజా, ఆరెస్సెస్ సిద్ధాంతకర్త పరమేశ్వరన్, మన తెలుగు తేజం షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు. ఈ జాబితాలో 10 ఆసియాన్ దేశాలకు చెందిన మరో 10 మంది కూడా ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు.