పుణేలోని నవ్‌నాథ్ యోవ్లే అనే చాయ్‌వాలా చరిత్ర సృష్టించాడు. కేవలం టీ అమ్మడం ద్వారా నెలకు రూ.12 లక్షలు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతడు నడుపుతున్న 'యోవ్లే టీ హౌస్' ఇప్పుడు పుణేలో ప్రముఖ టీ హౌస్‌గా మారిపోయింది. యెవ్లే టీ హౌస్ సహ వ్యవస్థాపకుడైన నవ్‌నాథ్ యెవ్లే మాట్లాడుతూ త్వరలోనే తమ బ్రాండ్‌ను ప్రపంచస్థాయిలో విస్తరిస్తామని తెలిపాడు.


పకోడా వ్యాపారంలా కాకుండా టీ విక్రయించడం ద్వారానూ నిరుద్యోగులకు ఉపాధి సృష్టించవచ్చని నవ్‌నాథ్ సూచిస్తున్నాడు. తన వ్యాపారం జోరుగా సాగుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నాడు. ప్రస్తుతం యెవ్లే టీ హౌస్‌కు పుణే నగరంలో మూడు బ్రాంచీలు ఉన్నాయి. ఒక్కో బ్రాంచీలో 12 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందరి సహకారంతోనే  నెలకు రూ.12 లక్షలకు పైగా ఆదాయం లభిస్తోందని నవ్‌నాథ్ పేర్కొన్నారు.