జైపూర్: రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఓ జోక్ పేల్చారు. "ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఎక్కడికెళ్లినా అక్కడ తన ప్రసంగంలో పదేపదే ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఎత్తుతున్నారు. బీజేపీ నేతలకన్నా రాహుల్ గాంధీనే ఎక్కువగా మోదీ పేరును జపిస్తున్నారు. రాహుల్ గాంధీ వైఖరి చూస్తోంటే, ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసుకుంటున్నారో లేక భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేస్తున్నారో తనకైతే అర్థం కావడం లేదు" అని చెప్పి రాహుల్ గాంధీని ఎద్దేవా చేశారు. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. 


ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన అమిత్ షా.. వివిధ అంశాల విషయంలో కాంగ్రెస్ ద్వంద వైఖరిని అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.