న్యూఢిల్లీ: ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌పై వడ్డీ రేట్లను సవరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పలు పథకాలపై స్వల్పంగా రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. నవంబర్ 28వ తేదీ నుంచి సవరించిన వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయని ఎస్బీఐ తమ ప్రకటనలో పేర్కొంది. అయితే, అన్నిరకాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కాకుండా కొన్నిరకాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మాత్రమే కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఎస్బీఐ స్పష్టంచేసింది. రూ.1 కోటిలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌పై మాత్రమే పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఎస్బీఐ తెలిపింది. అంతేకాకుండా ఏడాది, రెండేళ్లు కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌పై గతంలో ఉన్న వడ్డీ రేటు 6.7% కాగా ఇకపై 6.8% వర్తించనుంది. ఇక ఏడాది, రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్స్ చేసిన వయో వృద్ధులకు గతంలో వడ్డీ రేటు 7.2% కాగా తాజాగా వారికి అందించే వడ్డీ రేటును 7.3కి పెంచినట్టు ఎస్బీఐ వెల్లడించింది. 


రెండేళ్ల నుంచి మూడేళ్ల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌పై సైతం వడ్డీ రేటును గతంలో ఉన్న 6.75% నుంచి 6.80% కి పెంచింది. రెండేళ్ల నుంచి మూడేళ్ల స్లాబ్‌లో వయో వృద్ధులకు గతంలో అందించిన వడ్డీ రేటు 7.25% కాగా ఇకపై 7.30 రేటుతో వడ్డీ అందించనున్నట్టు ఎస్బీఐ వివరించింది. ఇవి మినహాయిస్తే, మిగతా పథకాలపై వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు ఉండబోదని బ్యాంక్ తేల్చిచెప్పింది.