న్యూ ఢిల్లీ: అయోధ్య తీర్పు తర్వాత బుధవారం సుప్రీం కోర్టు మరో సంచలన వివాదంలో కీలకమైన తీర్పు వెల్లడించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కుచట్టం 2005 (ఆర్టీఐ) పరిధిలోకే వస్తుందని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ నేతృత్వంలో న్యాయమూర్తులు ఎన్.వి. రమణ, డివై చంద్రచూద్, దీపక్ గుప్త, సంజివ్ ఖన్నా సభ్యులుగా వున్న ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. 


సుప్రీం కోర్టుతో పాటు సీజేఏ కార్యాలయం కూడా ప్రభుత్వ సంస్థలేనని అవి ఆర్టీఐ చట్టం పరిధిలోకి వస్తాయంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వగా.. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్, సుప్రీం కోర్టు కేంద్ర సమాచార అధికారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వాదనలు విని విచారణ పూర్తిచేసిన సుప్రీం కోర్టు ఏప్రిల్ 4న తుది తీర్పును రిజర్వ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే.