కథువా అత్యాచార, హత్య ఘటన కేసును ఢిల్లీ నుండి చండీగఢ్ ప్రాంతానికి బదిలీ చేయాలని మరణించిన బాలిక తండ్రి సుప్రీంకోర్టుకి విన్నవించుకున్నారు. తమకు తరచు బెదిరింపులు వస్తున్నాయని.. అందుకే కేసును వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని ఆయన కోరారు. అలాగే ఈ కేసును వాదిస్తున్న మహిళా న్యాయవాది దీపిక రజావత్ కూడా స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనను కూడా రేప్ చేసి చంపేస్తామని పలువురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి బెదిరిస్తున్నారని ఆమె తెలిపారు. అందుకే కేసును వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని అడిగారు. అయితే ఈ కేసు బదిలీ విషయమై జమ్ము కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరి ఏమిటి అన్నది స్పష్టం చేయాలని కోర్టు తెలిపింది. అలాగే బాధితురాలి కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని పోలీస్ డిపార్టుమెంటును ఆదేశించింది. ఏప్రిల్ 27వ తేదిన ఈ కేసు హియరింగ్ ఉండనుంది.


ఇప్పటికే కథువా జిల్లా కోర్టు ఈ కేసుకు సంబంధించి విచారణకు ఆదేశించింది. అయితే గతంలో జరిగిన హియరింగ్‌లో నిందితులు తాము ఈ నేరం చేయలేదని.. కావాలంటే నార్కో టెస్టులు నిర్వహించి నిజనిజాలు తేల్చాల్సిందిగా తెలిపారు. ఈ కేసులో ప్రధానంగా మాజీ ప్రభుత్వ ఉద్యోగి మరియు దేవాలయ కేర్ టేకర్ పై ఆరోపణలు ఉన్నాయి.


అలాగే ఆయన వద్ద రూ.4 లక్షలు స్వీకరించి సాక్ష్యాలను తారుమారు చేశారని ఇద్దరు పోలీస్ అధికారులపై కూడా ఆరోపణలు ఉన్నాయి. బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేయడమే కాకుండా.. ఆ తర్వాత దారుణంగా కొట్టి హతమార్చినట్లు వీరిపై కేసు నమోదైంది