లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో గురువారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తోన్న ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తోన్న పికప్ వ్యాన్ నగ్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్వా ఖేరా వద్ద ఇందిర కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదం నుంచి గజ ఈతగాళ్లు 22 మందిని క్షేమంగా రక్షించగా మరో ఏడుగురు చిన్నారుల ఆచూకీ లభించకపోవడం వారి తల్లిదండ్రులు, బంధువులను ఆందోళనకు గురిచేస్తోంది. లక్నో నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు ఘటనాస్థలం వద్దే వుండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్పంచుకుంటున్నాయి.
  
ఘటనాస్థలం వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నట్టు లక్నో రేంజ్ ఐజి ఎస్కే భగత్ తెలిపారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్... బాధితులకు అన్ని విధాల సహాయపడాల్సిందిగా అధికారులకు ఆదేశించారు.