ఢిల్లీ: పాత నోట్లను రద్దు చేసిన అనంతరం ఆర్‌బీఐ కొత్తగా రూ.2వేల నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే..! అయితే ఆ నోట్లను రద్దు చేస్తారని ప్రచారం జరుగుతున్న వాటిలో వాస్తవం లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్ లోక్‌సభలో వెల్లడించారు. కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2వేల నోట్లను రద్దు చేయమని ఓ ప్రశ్నకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రూ.10 ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయని వివరించారు.  


అయితే రూ.10 ప్లాస్టిక్ నోట్లను ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. జైపూర్, కోచి, మైసూరు, సిమ్లా, భువనేశ్వర్ నగరాల్లో వీటిని ట్రయల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.  కాగా, ప్రస్తుతం ఉన్న రూ.500 నోట్ల సైజు 66 ఎంఎంX150 ఎంఎం ఉండగా, రూ.2000 నోట్ల సైజు 66 ఎంఎంX166 ఎంఎంగా ఉందని, వాటి సైజుల్లో 10 మిల్లీమీటర్ల తేడా ఉన్నందున తేలికగానే గుర్తించవచ్చని తెలిపారు.