జీడిపప్పు సామాన్యులకు అందని ద్రాక్ష. ఎందుకంటే మామూలుగానే దీని ధర వందల్లో ఉంటుంది. హైదరాబాద్ లాంటి సిటీల్లో కేజీ 800 పైమాటే. క్వాలిటీ జీడిపప్పు ధర 1000-1200 వరకు ఉంటుంది. ఇంతటి ఖరీదైన జీడిపప్పు కేజీ కేవలం 10, 20 రూపాయల్లో అమ్ముతున్నారు. కొనడానికి క్యూలో నిల్చుంటున్నారు. ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా ? 


జార్ఖండ్ రాష్ట్రంలోని జామాతారా జిల్లాలో ఈ విడ్డూరం చోటుచేసుకుంది. అక్కడ జీడితోటలలో సాగు చేసిన జీడిపప్పును మహిళలు, పిల్లలు అమ్ముతున్నారు. అటువైపు వెళ్లే ప్రజలు కూడా కార్లు ఆపిమరీ కొంటున్నారు. దీనికంతటికి కారణం కొన్నాళ్ల కిందట ఇక్కడ డిప్యూటీ కమీషనర్ గా సేవలందిన కృపాయనంద ఘా అని స్థానికులు చెప్పుకొచ్చారు. ఆయన కృషి ఫలితంగా 49 ఎకరాల్లో జీడీ తోటలు వేసి సాగు చేస్తున్నామని, శాస్త్రవేత్తల సలహాల మేరకు భౌగోళిక పరిస్థితుల వల్ల తక్కువ విస్తీర్ణంలో కూడా అధిక దిగుబడి సాధిస్తున్నామని స్థానికులు చెప్పారు.