Shifting Homeless Old Man To Dumping Yard: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మునిసిపల్ విభాగం శానిటరి సిబ్బంది ఎవ్వరి తోడూ లేని వృద్ధుడి పట్ల పైశాచికంగా ప్రవర్తించారు. నా అనే వారి ఆధరణ లేకుండా అనాధగా మారి జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ వద్ద ఆశ్రయం పొందుతున్న రామ్మోహన్ అనే వృద్ధుడిని జంగారెడ్డిగూడెం శానిటేషన్ విభాగం సిబ్బంది పురపాలక సంఘం చెత్త ట్రాక్టరులో డంపింగ్ యార్డుకు తరలించేందుకు ప్రయత్నించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృద్ధుడిని చెత్త ట్రాక్టర్ ఎక్కించి డంపింగ్ యార్డుకు తరలిస్తుండగా గమనించిన స్థానికులు ట్రాక్టర్‌కి అడ్డం వెళ్లి సిబ్బందిని అడ్డుకున్నారు. స్థానికులు అడ్డుకున్నప్పటికీ.. శానిటేషన్ సిబ్బంది అతడిని అక్కడి నుంచి చెత్త ట్రాక్టరులో డంపింగ్ యార్డుకు తరలించడానికే మొగ్గుచూపారు. దీంతో స్థానికులకు, శానిటేషన్ అధికారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. 

కాకినాడకు చెందిన రామోహన్ గత కొంత కాలంగా జంగారెడ్డిగూడెం పాత బస్టాండులోనే ఉంటూ అక్కడే తల దాచుకుంటున్నాడు. లేవలేని పరిస్థితి‌లో ఉన్న రామ్మోహన్ ని కనీసం వృద్ధుడు అనే కనికరం కూడా లేకుండా మానవత్వం మర్చిపోయి చెత్త తరలించే ట్రాక్టరులో చెత్తతో పాటే ఎక్కించి డంపింగ్ యార్డుకు తరలించడాన్ని స్థానికులు స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకవేళ మీ కుటుంబ సభ్యులు కూడా ఇదే పరిస్థితిలో ఉంటే ఇలానే చేస్తారా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో మునిసిపల్ అధికారులు ఆ వృద్ధుడిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.