భూమి మీద నూకలు మిగిలి ఉన్నంత కాలం, యమ ధర్మరాజు కూడా ఏమీ చేయలేడని అంటుంటారు పెద్దలు. ఇదిగో తమిళనాడులోని మధురైలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఓ రోడ్డు ప్రమాదం దృశ్యం చూస్తే, అది నిజమేనేమోననిపించకమానదు! వేగంగా వస్తోన్న తమిళనాడు ఆర్టీసీ బస్సును మరో వైపు నుంచి వేగంగా వచ్చిన ఓ బైక్ బలంగా ఢీకొంది. ఆర్టీసీ బస్సు వేగం ధాటికి బైక్ పై ఉన్న ముగ్గురు యువకులు ఎగిరి రోడ్డుపై పడిపోయారు. బస్సు బైక్ పై నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ముగ్గురు యువకులు మొదట అపస్మారక స్థితిలోకి జారుకున్నప్పటికీ.. ఆస్పత్రిలో చేర్పించిన అనంతరం తిరిగి కోలుకున్నారు. ఈ నెల 16న జరిగిన ఈ రోడ్డు ప్రమాదం అదే కూడలిలో ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.