జైపూర్: రానున్న ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఇవాళ జైపూర్‌లో జరుగుతున్న ఐపీఎల్ వేలంలో టీమిండియా యంగ్ క్రికెటర్, తెలుగు యువ కెరటం హనుమ విహారి రూ.2 కోట్లు ధర పలికాడు. ముంబై జట్టుతో పోటీపడి మరీ ఢిల్లీ క్యాపిటల్ ఫ్రాంచైజ్ రూ. 2 కోట్లకు హనుమ విహారిని సొంతం చేసుకుంది. మొత్తానికి 2018 ఏడాది హనుమ విహారికి శుభాన్నే ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్న హనుమ విహారి తన తొలి మ్యాచ్‌లోనే 124 బంతుల్లో అర్థ సెంచరీ (56 పరుగులు 7x4, 1x6) చేసి అందరి కంట్లో పడ్డాడు. ముఖ్యంగా సెలెక్టర్ల కంట్లో పడిన విహారికి ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ అవకాశం లభించిన సంగతి తెలిసిందే.