india vs australia: ఆస్ట్రేలియాతో జరిగిన మూడోవన్డేలో భారత మహిళల జట్టు 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పలు రికార్డులు సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ్యాచ్ విషయానికొస్తే...
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు (Australia Women) ముందుగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రేచెల్ హెయిన్స్ (13), అలీసా హీలీ (35) కలసి తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. అయితే జులన్ గోస్వామీ (Jhulan Goswami) ఒకే ఓవర్లో రేచల్ హెయిన్స్ (13), మెగ్ లాన్నింగ్స్ (0)ను పెవీలియన్ పంపింది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తుండటంటో ఆసీస్ బ్యాటర్లు క్రీజులో నిలవలేక పోయారు. దీంతో 87 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో వన్డేలో సెంచరీ కొట్టిన బెత్ మూనీ (52), ఆష్లీ గార్డెనర్ (67), తహిలా మెక్‌గ్రాత్ (47) రాణించడంతో ఆస్ట్రేలియా కోలుకొని భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి ఇండియా ముందు భారీ టార్గెట్ నిలిపింది. జులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్ చెరి 3 వికెట్లు తీయగా.. స్నేహ్ రాణాకు ఒక వికెట్ దక్కింది.


Also Read: Womens Cricket: ఉత్కంఠ పోరులో భారత్‌పై ఆసీస్ విజయం..సిరీస్‌ కంగారూలదే..


రాణించిన భారత్ టాపార్డర్
ఇక ఛేజింగ్‌లో భారత(Team india) టాపార్డర్ రాణించింది. స్మృతి మంధాన (22) (Smriti Mandhana) త్వరగానే అవుటైనా.. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ (56), యాస్తికా భాటియా (64) కలసి రెండో వికెట్‌కు 101 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. అయితే స్వల్ప వ్యవధిలో టీమ్ ఇండియా షెఫాలీ వర్మ, రిచా ఘోష్ (0), యాస్తికా భాటియా వికెట్లు కోల్పోయింది. మిథాలీ రాజ్ (16) (Mithali Raj), పూజా వస్త్రాకర్ (3) కూడా నిరాశ పరచడంతో భారత్ ఓటమి దిశగా పయనించింది. అయితే దీప్తి శర్మ (31), స్నేహ్ రాణా (30) కలసి ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నారు. వీరిద్దరు కలసి ఏడో వికెట్‌కు 33 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరూ అవుటైనా జులన్ గోస్వామి, మేఘన సింగ్ కలసి భారత జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జులన్ గోస్వామికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.


భారత్ రికార్డులు:
*ఆస్ట్రేలియా జట్టు వరుసగా 26 వన్డేల్లో విజయం సాధించగా.. ఆ విజయ పరంపరను భారత మహిళలు అడ్డుకున్నారు.
*భారత మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక రన్ చేజ్ ఇదే. భారత జట్టు 250+ పరుగులను ఛేజ్ చేయడం ఇదే మొదటి సారి. గతంలో 248 పరుగులను సౌతాఫ్రికా మీద ఛేజ్ చేసింది.
 *ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో అర్దసెంచరీ చేసిన రెండో అతిపిన్న వయస్కురాలిగా షెఫాలీ వర్మ రికార్డు సృష్టించింది.


ఝుల‌న్ గోస్వామి అరుదైన ఘనత


భారత మహిళా జట్టు స్టార్‌ పేస్‌ బౌలర్‌ ఝుల‌న్ గోస్వామి(Jhulan Goswami) చ‌రిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన నామమాత్రపు ఆఖరి వ‌న్డేలో మెగ్ లానింగ్‌ను ఔట్ చేయ‌డం ద్వారా అరుదైన 600 వికెట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటివరకు 192 వన్డేలు, 11 టెస్ట్‌లు, 56 టీ20ల్లో 337 అంతర్జాతీయ వికెట్లు సాధించిన ఝులన్‌.. దేశవాళీ టోర్నీల్లో 264 వికెట్లు పడగొట్టి తన వికెట్ల సంఖ్యను 601కి పెంచుకుంది. ఝులన్‌ పేరిట ఇప్పటికే వన్డేల్లో అత్యధిక వికెట్ల (240) రికార్డు నమోదై ఉంది. 38 ఏళ్ల ఝులన్‌ వన్డే ఫార్మాట్‌లో 200 వికెట్లు పడగొట్టిన ఏకైక మహిళా బౌలర్‌గా నేటికీ చలామణి అవుతుంది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి