అంధుల క్రికెట్ ప్రపంచకప్‌‌ను భారత్ కైవసం చేసుకొని వార్తల్లో నిలిచింది.ఫైనల్లో ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేసిన 308 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్ల తేడాతో ఛేదించి విజయాన్ని నమోదు చేసింది. భారత బ్యాట్స్‌మన్ సునీల్‌ 93 పరుగులు చేయగా అజయ్‌ రెడ్డి 62 పరుగులు చేసి విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. 35 ఓవర్లలో 271/4 స్కోరుతో భారత్ నిలిచినప్పుడు టెయిలెండర్లు విజయ బాధ్యతను తమపై వేసుకొని బాగానే రాణించారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ ఈ నెల 13న జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో పాక్‌ను చిత్తుచేసిన సంగతి తెలిసిందే. అంధుల క్రికెట్ ప్రపంచ కప్ భారత్ గెలిచిందని తెలియగానే.. జట్టును అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. వీరిని దేశఘనతను చాటిన నిజమైన ఛాంపియన్లుగా అభివర్ణించారు. భారత్ అంధుల క్రికెట్‌లో టైటిల్ గెలవడం ఇది రెండోసారి.