రాంచి: మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి 133 పరుగులకే సౌతాఫ్రికా కుప్పకూలింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు 3-0 తేడాతో గెలుపొంది సిరీస్‌ని సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ మహ్మద్ షమీ 3 వికెట్లతో సత్తా చాటుకోగా ఉమేష్ యాదవ్ 2, నదీమ్ 2, జడేజా, అశ్విన్‌కు చెరో వికెట్ దక్కాయి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


అంతకన్నా ముందుగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 497 పరుగులు చేసి సఫారీల ఎదుట భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు 162 పరుగులకే చాపచుట్టేశారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 212 పరుగులతో డబుల్ సెంచరీ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అజింక్య రహానే 115, జడేజా 51, సాహా 24, ఉమేష్ యాదవ్ 31 పరుగులతో ఆకట్టుకున్నారు. ఉమేష్ యాదవ్ 5 సిక్స్‌లతో చెలరేగిపోగా.. యాదవ్ ఆటను కోహ్లీ ఎంజాయ్ చేయడం హైలైట్‌గా నిలిచింది.