ముంబై: విండీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా పరుగుల వరద పారించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 377 పరుగుల భారీ స్కోర్ చేసింది.  రోహిత్ శర్మ (162), తెలుగుతేజం అంబటి రాయుడు (100) సెంచరీలతో కదంతొక్కడంతో ఈ మేరకు భారీ స్కోర్ సాధ్యపడింది. ఇక మిగిలిన బ్యాట్స్ మెన్ల విషయానికి వచ్చినట్లయితే... ఓపెనర్ శిఖర్ ధావన్ 38 పరుగులు చేయగా.. ధోనీ 23 , జాదవ్ 12 , రవీంద్ర జడేజా 7 పరుగులు సాధించారు. మూడు వన్డేల్లో హ్యాట్రిక్ సెంచరీలు చేసి మంచి ఊపుమీద ఉన్న కెప్టెన్ కోహ్లీ ఈ మ్యాచ్ లో 16 పరుగులు మాత్రమే చేశాడు. కాగా గత మ్యాచ్ లో టీమిండియా ఉంచిన 321 పరుగుల భారీ స్కోర్ చేధించిన విండీస్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో 378 పరుగుల ఈ భారీ టార్గెట్ ను విండీస్ ఏ మేరకు చేధిస్తుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది.