Rinku Singh Hits 5 Sixes Kolkata Knight Riders won by 3 Wickets: కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జెయింట్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో కోల్‌కతా విజయానికి 29 పరుగులు అవసరం అవ్వగా.. రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా ఐదు సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. ఏ మాత్రం విజయంపై నమ్మకంలేని దశలో రింకూ అద్భుతం చేశాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు చూడని ఫినిషింగ్ ఇచ్చాడు. బౌలర్‌ యాశ్ ధయాల్‌ చివరి ఓవర్‌లో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కోతా ఏడు వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయాన్ని అందుకుంది.  రింకూ 21 బంతుల్లో 48 పరుగులు చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



గుజరాత్ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శుభారంభం లభించలేదు. 20 వద్ద ఫామ్‌లో ఉన్న రహ్మానుల్లా గుర్బాజ్ (15) రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరువాత కాసేటికే నారాయణ్ జగదీషన్ (6) రూపంలో కేకేఆర్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఈ సమయంలో వెంకటేష్ అయ్యర్, కెప్టెన్ నితీష్ రాణా జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 55 బంతుల్లో 100 పరుగులు జోడించడంతో కేకేఆర్ రేసులోకి వచ్చింది. 


అయితే జట్టు స్కోరు 128 పరుగుల వద్ద నితీష్ రాణా (45) ఔట్ అవ్వడంతో కోల్‌కతా మూడో వికెట్ కోల్పోయింది. మరో ఎండ్‌లో వెంకటేష్ అయ్యర్ మంచి షాట్లు ఆడడంతో కేకేఆర్ విజయం ఖాయం అనిపించింది. అయితే 40 బంతుల్లో 83 పరుగులు చేసిన వెంకటేష్‌ అయ్యర్ (8 ఫోర్లు, ఐదు సిక్సర్లు)ను జోసఫ్ ఔట్ చేసి కేకేఆర్‌ను దెబ్బ తీశాడు. ఆ తరువాత రషీద్ ఖాన్ 17వ ఓవర్‌లో తొలి 3 బంతుల్లోనే వరుసగా 3 వికెట్లు తీసి మ్యాచ్‌ని గుజరాత్‌ వైపు తిప్పాడు. తొలి బంతికి ఆండ్రీ రస్సెల్‌ను ఔట్ చేయగా.. తరువాత రెండు బంతుల్లో సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్‌లను పెవిలియన్‌కు పంపించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది 19వ హ్యాట్రిక్. 


 Also Read: MS Dhoni's Tweet on Jadeja: పదేళ్ల క్రితం జడేజా ఫీల్డింగ్‌పై ధోనీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్


చివరి 2 ఓవర్లలో కోల్‌కతా జట్టు విజయానికి 43 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో రింకూ సింగ్, ఉమేష్ యాదవ్ ఉన్నారు. 19 ఓవర్‌ రింకూ సింగ్ 6, 4 బాదడంతో 14 రన్స్ వచ్చాయి. చివరి ఓవర్‌లో 29 పరుగులు కావాల్సి ఉండగా.. యాశ్ ధయాల్ వేసిన ఈ ఓవర్‌ మొదటి బంతికి ఉమేష్‌ యాదవ్ సింగిల్ తీసి.. రింకూ సింగ్‌కు స్ట్రైకింగ్‌కు ఇచ్చాడు. చివరి ఐదు బంతులను స్టాండ్స్‌లోకి పంపించిన రింకూ సింగ్ కేకేఆర్‌కు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. ఐపీఎల్‌ చరిత్రలో చివరిలో ఐదు సిక్సర్లు బాది జట్టును గెలిపించిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు.  గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, జోసఫ్ 2, మహ్మాద్ షమీ, లిటిల్ తలో వికెట్ తీశారు.


 




అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేసింది. శుభ్‌మన్ గిల్ (39) పర్వాలేదనిపించాడు. యంగ్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ 38 బంతుల్లో 53 పరుగులతో రాణించగా.. విజయ్ శంకర్ 24 బంతుల్లో 63 పరుగులతో (4 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లు తీయగా.. సుయాష్ శర్మ ఒక వికెట్ తీశాడు.


Also Read: IPL 2023 Records: కోహ్లీ రికార్డును బద్ధలు కొట్టిన డేవిడ్ వార్నర్.. ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల వీరులు వీళ్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook