ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా జట్టు.. తొలి సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లోనే ఓటమిపాలై టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటి నుంచి కూడా కొంతమంది టీమిండియా ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్ స్టాఫ్, సహాయ సిబ్బందిలో కొంతమంది ఇంగ్లండ్‌లోనే చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. కొంతమంది సీనియర్ ఆటగాళ్లు, బీసీసీఐ బోర్డుకు చెందిన కీలక సభ్యులు, సిబ్బంది మాత్రమే భారత్‌కి తిరిగొచ్చినప్పటికీ... మిగతా వారికి ఇంకా టికెట్స్ దొరక్కపోవడంతో జులై 14వ తేదీ వరకు అక్కడే చిక్కుకుపోవాల్సిన పరిస్థితి తలెత్తినట్టు ఎన్డీటీవీ ప్రచురించిన ఓ కథనం పేర్కొంది. 


తొలి సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో భారత్ ఓటమి అనంతరం.. ఇంకా ఇంగ్లండ్‌లో ఉంటూ వరల్డ్ కప్ మ్యాచ్‌లు వీక్షించడానికి ఇష్టం లేని భారతీయులు.. నిరాశతో ఒక్కసారిగా భారత్‌కి వెనుతిరగడంతో అందరికీ అవసరమయ్యే విధంగా టికెట్స్ లభ్యమవడం లేదని వార్తా కథనాలు వెలువడుతున్నాయి.