Mobile Exploded When Talking While Charging: సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టిన సమయంలో ఫోన్ మాట్లాడకూడదు అని గత కొన్నేళ్లుగా ఎంతో మంది మొబైల్స్ సైన్స్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ.. అవగాహన లోపం వల్లో లేక నిర్లక్ష్యం వల్లో అదే పని చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు అడపదడపా వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ జిల్లా బర్నాగర్ మండలంలో అందరికీ వెన్నులో వణుకు పుట్టించేదిగా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టిన దయారామ్ బరోడ్ అనే 68 ఏళ్ల వృద్ధుడు.. తన స్నేహితుడితో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఉన్నట్టుండి ఫోన్ భారీ శబ్ధంతో పేలిపోయింది. ఈ దుర్ఘటనలో దయారామ్ బరోడ్ ముఖం, ఛాతి, తల భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. మొబైల్ ఫోల్ పేలుడు ఘటనలో ఊహించని విధంగా తీవ్రంగా గాయాలపాలైన దయారామ్.. అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి చనిపోయాడు.


ఈ ఘటనపై పేలుడు జరిగిన సమయంలో దయారామ్‌తో ఫోన్‌లో మాట్లాడిన దినేష్ స్పందిస్తూ, తన స్నేహితుడి అకాల మరణంపై తీవ్ర విచారం వ్యక్తంచేశాడు. ఆ సమయంలో తమ బంధువుల అంత్యక్రియలకు హాజరయ్యే విషయమై ఫోన్‌లో మాట్లాడుతున్నామని.. ఉన్నట్టుండి భారీ శబ్ధంతో ఫోన్ కాల్ కట్ అయింది. తిరిగి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్ కాల్ కనెక్ట్ అవలేదు. దీంతో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని వచ్చేచూసే సరికి రక్తపు మడుగులో దయారామ్ శవం కనిపించింది అని పోలీసులకు జరిగిన విషయం చెప్పుకొచ్చాడు.


దయారామ్ ఉపయోగించిన సెల్ ఫోన్ గుర్తుపట్టడానికి వీల్లేకుండా పేలిపోయి కనిపించింది. చార్జర్ కూడా పేలుడు ధాటికి మాడిపోయింది. చార్జర్, సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరికి పంపించగా అసలు విషయం వెలుగుచూసింది. సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడటం వల్లే ఫోన్ ఓవర్ హీట్ అయి పేలుడు జరిగిందని తెలిసింది.


చార్జింగ్ పెట్టి ఫోన్ ఎందుకు మాట్లాడకూడదంటే..
చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడినట్టయితే.. ఆ సమయంలో ఫోన్‌లో జరిగే కెమికల్ చేంజేస్ కారణంగా బ్యాటరీ ఓవర్ హీట్ అవడం.. అది కాస్తా వేడి తీవ్రత పెరిగినప్పుడు బ్యాటరీ పేలిపోవడం జరుగుతుంది అని ఇప్పటికే ఎంతో మంది సెల్ ఫోన్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఉజ్జయిన్ జిల్లాలో వృద్ధుడు దయారామ్ మృతి విషయంలోనూ అదే జరిగింది.