Double Bedroom Flats Distribution: ఎన్నికలకు ముందు తియ్యటి మాటలు చెప్పి, ప్రజలని మభ్య పెడుతూ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజలని మోసం చేస్తున్నారని బీజేపి నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని మంజూరు చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద బిజెపి చేపట్టిన ధర్నాకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఆగస్టు 15వ తేదీ లోపు నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని మంజూరు చేయాలని.. లేని పక్షంలో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి, ఇప్పటివరకు నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి నిరుపేదలని పంపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికలు వచ్చిన ప్రతీసారి తియ్యటి మాటలతో ప్రజలను మభ్య పెడుతూ ప్రజలని ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. ఓట్ల కోసం మాత్రమే కేసిఆర్ కొత్త కొత్త పథకాలని ప్రవేశపెట్టడం జరుగుతుందని.. ఆ తరువాత ఇచ్చిన హామీలను, ప్రవేశపెట్టిన పథకాలను మర్చిపోవడం జరుగుతోంది అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కులవృత్తుల రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో గులాబీ కండువ కప్పుకున్న వారికే రుణాలు వస్తున్నాయని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లపై పోరాటాలు చేస్తాను అని తెలిపారు. 


కామారెడ్డిలో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టి నాలుగేండ్లు గడిచినప్పటికీ.. ఏ ఒక్క పేద వారికి కూడా ఇల్లు ఎందుకు పంపిణీ చేయలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దేశంలో 50 లక్షల ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించింది అని తెలిపారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రం రాజకీయ జీవితం ప్రారంభమైన 1983 సంవత్సరం నుంచి 2023 వరకు సిద్దిపేట, కరీంనగర్ మహబూబ్ నగర్, హైదరాబాద్ నగరాలలో పెద్ద పెద్ద భవంతులు కట్టుకుని.. నివాసం లేని నిరు పేదలను మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 


ఇది కూడా చదవండి : Good news to VRAs: వీఆర్ఏలకు గుడ్ న్యూస్.. ఇకపై శాఖసింధి వ్యవస్థ రద్ధు


2024 సంవత్సరంలో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావు.. అప్పుడు తమ ప్రభుత్వమే నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యతను తీసుకుంటుంది అని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షురాలు అరుణతార, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకట రమణా రెడ్డి, నాయకులు వేణుగోపాల్ గౌడ్, రాజు, నరేందర్, రవి పెద్ద సంఖ్యలో మహిళలు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.


ఇది కూడా చదవండి : YS Sharmila: ప్రజలకు చిప్ప చేతిలో పెడుతున్నడు.. సీఎం కేసీఆర్‌పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి