తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు నవంబర్ నెలలోనే జరగనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలుసుకున్న అనంతరం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ విలేకరులతో మాట్లాడతూ నాలుగు రాష్ట్రాలతోపాటే తెలంగాణలోనూ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. డిసెంబర్ మొదటి వారంలోనే ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాకు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇదే సమావేశంలో 105 నియోజకవర్గాలకుగాను అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఈ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజానికం తమ పార్టీ అభ్యర్థులనే భారీ మెజార్టీతో ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తారని, గెలుపు టీఆర్ఎస్‌దేనని ధీమా వ్యక్తంచేశారు. కేవలం బాబూమోహన్, నల్లాల ఓదేలు మినహా.. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారికే పార్టీ టికెట్స్ కేటాయించినట్టు సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో చెప్పారు.