Hanuman Shobha yatra 2021 in Hyderabad: హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ చేపట్టనున్న వీర హనుమాన్ విజయ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై హై కోర్టును ఆశ్రయించిన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్‌లకు శోభాయాత్ర నిర్వహించేందుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పాత బస్తీలోని గౌలిగూడ రామ్ మందిర్ (Ram mandir) నుంచి బేగంపేట ఎయిర్ పోర్టు సమీపంలోని తాడ్‌బన్ హనుమాన్ మందిరం వరకు శోభాయాత్ర నిర్వహించుకునేందుకు అనుమతి ఇస్తూనే హై కోర్టు పలు (TS High court) షరతులు విధించింది. 


హనుమాన్ శోభా యాత్రలో (Hanuman Shobha yatra) 21 మందికి మించి పాల్గొన వద్దని, సోషల్ డిస్టన్సింగ్ నిబంధనలకు విఘాతం కలగకుండా ఒక బైక్‌పై ఒక్కరు మాత్రమే ఉండాలని హై కోర్టు సూచించింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య శోభాయాత్ర పూర్తి చేయాలని హై కోర్టు స్పష్టంచేసింది. హనుమాన్ శోభాయాత్ర నిర్వహణను వీడియో చిత్రీకరించి నివేదిక రూపంలో సమర్పించాలని హైదరాబాద్ పోలీసులను (Hyderabad police) ఆదేశించింది. కోవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో చట్టరీత్యా చర్యలకు బాధ్యులవుతారని వీహెచ్ పీ, భజరంగ్ దళ్ సంస్థలకు (VHP, Bhajrangdal) హై కోర్టు తేల్చిచెప్పింది.