హైదరాబాద్: కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి చెందకుండా తెలంగాణ సర్కార్ (Telangana govt) తీసుకుంటున్న చర్యలకు ఉపయోగపడేందుకు వీలుగా పలు వ్యాపార, విద్యా సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి (CM relief fund) పెద్ద ఎత్తున విరాళాలు అందించాయి. తమ విరాళాలకు సంబంధించిన చెక్కులను ఆయా సంస్థల ప్రతినిధులు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR)కు అందించారు. హెటిరో డ్రగ్స్ (Hetero drugs) రూ.5 కోట్ల విరాళం అందించడంతో పాటు రూ. 5 కోట్ల విలువైన మందులను (హైడ్రాక్సి క్లోనోక్విన్, రిటోనవిర్, లోపినవిర్, ఒసెల్టమివిర్) కూడా ప్రజల సహాయార్థం ప్రభుత్వానికి అందించారు. హెటిరో చైర్మన్ పార్థసారధి రెడ్డి, డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి చెక్కును ముఖ్యమంత్రి చేతికి, మందులను వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు అందించారు. 


తెలంగాణ మోటార్ వెహికిల్స్ ఇన్స్‌పెక్టర్ అసోసియేషన్ రూ.1.5 కోట్ల విరాళం అందించింది. అసోసియేషన్ అధ్యక్షుడు కె.పాపారావు, ఇతర ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. 
సువెన్ ఫార్మా (suven pharma) కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సువెన్ ఫార్మా చైర్మన్ వెంకట్ జాస్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు
ఎన్.సి.సి. లిమిటెడ్ (NCC Ltd) కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండి ఎ. రంగరాజు ముఖ్యమంత్రికి అందించారు
శ్రీ చైతన్య విద్యాసంస్థలు (Sri chaitanya) కోటి రూపాయల విరాళం అందించాయి. తమ విరాళానికి సంబంధించిన చెక్కును ఆ సంస్థ డైరెక్టర్ వై.శ్రీధర్ ముఖ్యమంత్రికి అందించారు.