Hyderabad: హైదరాబాద్‌ పాతబస్తీలో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలంగాణవ్యాప్తంగా ఆయనపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ నుంచి రాజాసింగ్‌ను సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేయకూడదో వచ్చే నెల 2లోపు సమాధానం చెప్పాలని షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈనేపథ్యంలో బుధవారం పాతబస్తీలో అల్లర్లు చెలరేగాయి. ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు ఆందోళనకు దిగారు. బేగంబజార్ ఛత్రి ప్రధాన మార్గంలో బీభత్సం సృష్టించారు. బైక్‌లను మంటలు పెట్టి నిరసనలు తెలిపారు. ఓ హోటల్‌పై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. కొందరు అల్లరి మూకలు పోలీసులపైకి రాళ్లు విసిరారు.


అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టారు. శాలిబండ వద్ద పోలీసుల వాహనంపైకి కొందరు రాళ్లు విసిరారు. ఈఘటనలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. మరోవైపు గణేష్‌ ఉత్సవాలు సమీపిస్తుండటంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాను రెట్టింపు చేశారు. ప్రజాప్రతినిధులు, నేతల ఇళ్ల వద్ద పోలీసులను మోహరించారు. పోలీసులు, సిబ్బందికి సెలవులను రద్దు చేశారు. 


అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉండటంతో నగర పశ్చిమ, దక్షిణ మండల పరిధిలో దుకాణాలు, హోటళ్లపై ఆంక్షలు విధించారు. రాత్రి 7 నుంచి 8 లోపు దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరో మూడురోజులపాటు ఆంక్షలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. పలు చోట్ల పెట్రోల్ బంకులు, ఎల్పీజీ స్టేషన్లను మూసివేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు అయ్యింది. వనస్థలిపురం, అంబర్‌పేట పీఎస్‌ల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయినట్లు తెలుస్తోంది.


మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ పలు చోట్ల పోస్టర్లు కనిపిస్తున్నాయి. చార్మినార్, శాలిబండ, మదీనా ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. వెంటనే రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలని అందులో పేర్కొన్నారు. వీటిని ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఆయనను పరిపూర్ణానందస్వామి పరామర్శించారు. ఇటు రాజాసింగ్‌పై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీ లేఖ రాశారు. అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు అందజేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి