హైదరాబాద్ : వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిహరపురం కాలనీలో బుధవారం ఉదయం వివాహిత ఆత్మహత్య ఉదంతం తీవ్ర కలకలంరేపింది. భర్త రాఘవేందర్ వేధింపులు భరించలేక భార్య సౌమ్య బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలియగానే ఏం జరుగుతుందో ఏమోననే భయంతో రాఘవేందర్ సైతం బెడ్ రూమ్‌లోకి వెళ్లి ఉరేసుకునేందుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని తెలుస్తోంది. రాఘవేందర్ కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారు బెడ్ రూమ్ తలుపు పగలగొట్టి అతడిని రక్షించి హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం రాఘవేందర్ పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం.


స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మృతురాలు సౌమ్య స్వస్థలం. రాఘవేందర్ వేధింపుల వల్లే సౌమ్య చనిపోయిందని.. ఆమె చనిపోయిన తర్వాత ఆ కేసు ఎక్కడ తనపై పడుతుందోననే భయంతో రాఘవేందర్ ఆత్మహత్య డ్రామా ఆడుతున్నాడని సౌమ్య కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..