తెలంగాణలోని మల్టీప్లెక్స్‌ థియేటర్లలోకి ప్రేక్షకులు తమ వెంట తినుబండారాలు తీసుకువెళ్లే అవకాశాన్ని కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కోరుతూ ఇటీవల హైదరాబాద్ హై కోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సతీష్ కుమార్ అనే న్యాయవాది ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. మల్టీప్లెక్స్‌లోని సినిమా హాళ్లల్లో ఆహార పదార్థాల నాణ్యత, అధిక ధరలకు విక్రయాలు వంటి అంశాలపై వినియోగదారుల ఫోరాలను ఆశ్రయించాలని స్పష్టంచేస్తూ మంగళవారం ఈ వ్యాజ్యాన్ని కొట్టిపారేసింది. సినిమా చూస్తున్న ఆ మూడు గంటల్లోనే ఏదో ఒకటి తినాల్సిన అవసరం ఏముందని ఈ సందర్భంగా పిటిషనర్‌ని సూటిగా ప్రశ్నించిన హైకోర్టు.. సినిమా చూడ్డానికి మల్టీప్లెక్స్‌లకే ఎందుకు వెళ్లాలని వ్యాఖ్యానించడం గమనార్హం. 


ఆహార భద్రత చట్టం, సినిమా రెగ్యులేషన్‌ యాక్ట్‌, తూనికలు–కొలతల శాఖ చట్టాలతో ముడిపడిన ఈ అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా న్యాయ సమీక్ష జరపడం కుదిరే పని కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది.