Minister Prashanth Reddy Helps Road Accident Victims: హైదరాబాద్: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. గురువారం బాల్కొండ నియోజకవర్గంలో తన పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగి వస్తుండగా నగర శివార్లలో మేడ్చల్ నుండి కొంపల్లి వెళ్లే మార్గంలో తన భార్య, చిన్నారితో కలిసి వెళ్తున్న ఓ వ్యక్తి బైక్ పై నుండి స్కిడ్ అయి కిందపడిపోయాడు. ఆ సమయంలో అదే మార్గం గుండా వెళ్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. వారి బైక్ స్కిడ్ అయి కింద పడడం చూసి వెంటనే తన కాన్వాయ్ ని పక్కకు ఆపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి వద్దకు వెళ్ళి స్వయంగా వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 


చిన్నారిని గట్టిగా పట్టు కోవడంతో బైక్ పై నుండి పట్టుతప్పి పడి మహిళకు స్వల్ప గాయాలయ్యాయని గమనించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. వెంటనే వారిని దగ్గరుండి తన ఎస్కార్ట్ వాహనం ఎక్కించి బాధితులను హాస్పిటల్ పంపించారు. వారికి ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మనోధైర్యం చెప్పి అండగా నిలిచారు. అనుకోకుండా బైక్ స్కిడ్ అవడం వల్ల రోడ్డు ప్రమాదంలో గాయపడిన తమ కోసం మానవతా దృక్పథంతో స్పందించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి బాధితులు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు.