Revanth Reddy satires on LPG cylinder Price Cut: హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ పై రూ.200 తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఒక గజదొంగ దారిదోపిడీ చేసి సర్వం దోచుకున్న తర్వాత దారి ఖర్చుల కోసం రూ.200 ఉంచోకోమని ఇచ్చిననట్లుగా కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ బండ ధర రూ.410 ఉంటే దానిని మోడీ అధికారంలోకి వచ్చాక రూ. 1200 చేశారని దుయ్యబట్టారు. ఇన్నాళ్లు పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బందుల పాలు చేసి తీరా ఇప్పుడు గ్యాస్ ధర తగ్గించడాన్ని ఇలా కాకుండా మరెలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ పార్టీలో చేరికలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, బీఆరెస్ నేతలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో బస్తీలలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు. తిరగబడదాం.. తరిమికొడదాం నినాదంతో ముందుకు వెళదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 


అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు, పైలేరియా డయాలిసిస్ పేషంట్లకు నెలకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని రేవంత్ రెడ్డి మరోసారి హామీ ఇచ్చారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంతోపాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల సాయం అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి.


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటైన గృహ లక్ష్మి పథకాన్ని మైసూరులో రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. చేతి గుర్తు మా చిహ్నం..చేసి చూపించడమే మా నైజం అని ట్వీట్ చేశారు. 'కారు'కూతలు రావు'..జుటా' మాటలు లేవు అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై సెటైర్ వేశారు. 


చేతి గుర్తు మా చిహ్నం. చేసి చూపించడమే మా నైజం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కర్ణాటక ప్రజలకు ఇచ్చిన 5 హామీల్లో నాలుగింటిని నెరవేర్చి చరిత్ర సృష్టించాం. 'కారు'కూతలు రావు..  'జూటా' మాటలు లేవు. మా మాట శిలాశాసనం.. మా బాట ప్రజా సంక్షేమం.. తెలంగాణలోనూ వస్తున్నాం .. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం .. చిరునవ్వులను మోసుకొస్తున్నాం అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.