పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలోని రాంపల్లి వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యార్థులను తీసుకువెళ్తున్న ఓ స్కూల్ బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో అదుపు తప్పి రోడ్డుకు, పొలాలకు మధ్యలో ఉన్న చిన్న పిల్ల కాలువలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తుగా కాలువలో నీళ్లు లేకపోవడంతోపాటు.. బస్సు కాలువలోనే ఓ పక్కకు ఒరిగిపోయి నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు ఉండగా కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. 


ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని విద్యార్థులను క్షేమంగా బస్సులోంచి బయటికి తీసుకొచ్చారు. స్కూల్ బస్ బ్రేకులు ఫెయిలై ప్రమాదానికి గురైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది.