5 రోజులపాటు బాత్రూమ్లోనే ఏడేళ్ల బాలిక
5 రోజులపాటు బాత్రూమ్లోనే ఏడేళ్ల బాలిక
మక్తల్: అనుకోకుండా పక్కింటి బాత్రూమ్లో చిక్కుకుపోయిన ఓ ఏడేళ్ల బాలిక అక్కడే ఐదు రోజులపాటు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కేవలం నీళ్లు మాత్రమే తాగి బతికి బట్టకట్టింది. అందరినీ షాక్కి గురిచేసే ఈ ఘటన తెలంగాణలోని నారాయణ్పేట్ జిల్లా మక్తల్లో ఏప్రిల్ 20వ తేదీన చోటుచేసుకుంది. 2వ తరగతి చదువుతున్న కురవకచేరి అఖిల అనే బాలిక బిల్డింగ్పై ఆటలాడుకుంటూ పక్కింటి బాత్రూమ్పై పడిపోయింది. బాత్రూమ్పై భాగంలో కొంత భాగం తెరిచి ఉండటంతో సరిగ్గా ఆ రంద్రంలోంచే బాత్రూమ్ లో పడిపోయిందా బాలిక. అఖిల పడినచోట దండెంపై బట్టలు ఉండటంతో అదృష్టవశాత్తుగా దెబ్బలు తగలకుండానే బాత్రూమ్ లో కిందపడిపోయింది.
అయితే, ఆ బాత్రూమ్ వున్న ఇంటి యజమాని వెంకటేష్ హైదరాబాద్లోని తన కుటుంబాన్ని చూసేందుకు వెళ్లే క్రమంలో బాత్రూమ్ గదికి బయటి నుంచే గడియ బిగించి వెళ్లారు. దీంతో బాత్రూమ్ లో వున్న బాలిక పెట్టిన కేకలు, ఏడుపులు అరణ్య రోదనే అయ్యాయి. వృత్తిరీత్యా టీచర్ అయిన వెంకటేష్ స్కూల్కి సెలవులు కావడంతో హైదరాబాద్లోనే తన కుటుంబంతో ఉండిపోయాడు. ఐదు రోజుల అనంతరం ఓ పెళ్లికి హాజరయ్యేందుకు ఇంటికి తిరిగొచ్చిన వెంకటేష్.. బాత్రూమ్ తెరిచి చూడగా అందులో బాలిక స్పృహ తప్పి పడి ఉండటం చూసి షాక్ కి గురయ్యాడు. వెంటనే విషయాన్ని పక్కింట్లో వాళ్లకు చెప్పగా ఆ బాలికను గుర్తించిన వారు అఖిల తల్లిదండ్రులకు తెలియజేశారు.
ఐదు రోజులుగా ఆహారానికి దూరమై కేవలం బాత్రూమ్లోని నీళ్లతోనే కడుపు నింపుకుని బతికిన అఖిల అప్పటికే చిక్కి శల్యమై అస్వస్థతకు గురైంది. అఖిలను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అఖిల కనిపించకుండా పోయిన మరుసటి రోజే ఆమె తల్లిదండ్రులు సురేష్ కుమార్, మహాదేవమ్మ తమకు ఫిర్యాదు చేశారని, తాము సైతం ఇరుగుపొరుగు జిల్లాల పోలీసులను అప్రమత్తం చేసి దర్యాప్తు చేపట్టామని మక్తల్ ఎస్సై బి అశోక్ కుమార్ తెలిపారు.