హైదరాబాద్‌: గచ్చిబౌలిలో ఖరీదైన 2 ఎకరాల భూమిని రెగ్యులరైజ్‌ చేయడం కోసం ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా లేఖ ఇచ్చినట్టుగా ఓ లెటర్ హెడ్‌పై కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పరారీలో వున్న మరో నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితులు తమ పనిని సులభతరం చేసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన లెటర్‌హెడ్‌ను రెవెన్యూ శాఖకు పంపారు. అయితే, అనుమానం వచ్చిన రాజేంద్రనగర్ ఆర్డీవో దీనిపై ఆరాతీయగా నిందితుల అసలు బాగోతం బయటపడినట్టు తెలుస్తోంది. 


రాజేంద్ర నగర్ ఆర్డీవో ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను తమ అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి సంతకం ఫోర్జరీ చేయడానికి ఉపయోగించిన లెటర్‌ హెడ్‌ను యాకుత్‌పురా టీఆర్‌ఎస్‌ నేత నుంచి రూ.45 వేలకు కొనుగోలు చేసినట్టు సమాచారం.