తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా రజత్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఢిల్లీలోని నిర్వాచన్‌ సదన్‌లో ఎన్నికల కమిషనర్ల పానెల్‌ సమావేశమై, తెలంగాణకు నూతన ఎన్నికల ప్రధాన అధికారిగా ఆయనను ఎంపిక చేసింది.


1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన రజత్‌కుమార్‌ ప్రస్తుతం అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ ను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రీ-నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి సీఈవోగా రజత్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఈవోగా వ్యవహరించిన భన్వర్‌లాల్‌ ఏపీ విడిపోయాక రెండు తెలుగు రాష్ట్రాలకు సీఈవోగా వ్యవహరించారు. భన్వర్‌లాల్‌ రిటైర్ అయ్యాక ఏపీ సీఈవోగా సిసోడియా బాధ్యతలు చేపట్టారు.