Munugode Bypoll:  నామినేషన్ల పర్వం మొదలు కావడంతో మునుగోడు నియోజకవర్గంలో రాజకీయం తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఖరారు కావడంతో ప్రధాన పార్టీలన్ని తమ బలగాలను మునుగోడులో మోహరించాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 14 మంది మంత్రులు సహా 86 మంది ఎంపీ, ఎమ్మెల్సీ,  ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది. నియోజకవర్గాన్ని 86 క్లస్టర్లుగా విభజించి ప్రజా ప్రతినిధులను ఇంచార్జీలుగా నియమించింది. బీజేపీ కూడా వంది మంది ఓటర్లకో నేతకు బాధ్యతలు అప్పగించింది. ఆ పార్టీ నేతలంతా మునుగోడులోనే ఉన్నారు. కాంగ్రెస్ కూడా పూర్థిస్థాయిలో రంగంలోకి దిగింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా హస్తం పార్టీ అగ్రనేతలంతా ఈ మూడు వారాలు మునుగోడు నియోజకవర్గంలోనే ఉండనున్నారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పార్టీల పోటీపోటీ వ్యూహాలతో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఇంతలోనే మునుగోడు సీన్ లోకి ఎంటరై ట్విస్ట్ ఇచ్చారు టీజేఎస్ అధినేత కోదండరామ్. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో ఉంది టీజేఎస్. దీంతో మునుగోడు ఉప ఎన్నికలో టీజేఎస్ మద్దతు కోరింది పీసీసీ. కోదండరామ్ తో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. కోదండరామ్ మద్దతకు తమకే ఉంటుందని కాంగ్రెస్ భావించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేసిన కోదండరామ్ కు మునుగోడు నియోజకవర్గం పరిధిలో మంచి మద్దతు లభించిందని ఆ పార్టీలు వర్గాలు చెబుతున్నాయి. దీంతో కోదండరామ్ మద్దతు ఇస్తే తమకు బలం పెరుగుతుందని కాంగ్రెస్ అంచనా వేసింది. కాని ఇప్పుడు కాంగ్రెస్ కు షాకిస్తూ మునుగోడులో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు కోదండరామ్. రెండు మూడు రోజుల్లో టీజేఎస్ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ తో ఒరిగేది ఏమీ లేదని.. పేరు మార్చడం పెద్ద మోసమని ఆరోపించారు.


టీజేఎస్ నుంచి బలమైన అభ్యర్థిని బరిలకి దింపే యోచనలో కోదండరామ్ ఉన్నారని తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తానని రెండు రోజుల క్రితమే ప్రకటించారు ప్రజా యుద్దనౌక గద్దర్. కట్టుబట్టలతో మునుగోడుకు వెళ్లి ప్రచారం చేస్తానని చెప్పారు. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను కలవడంతో ఆ పార్టీ నుంచి గద్దర్ మునుగోడులో పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కాని తర్వాత క్లారిటీ ఇచ్చిన గద్దర్.. మునుగోడులో పోటీ చేయడం ఖాయమని.. కాని ఏ పార్టీ నుంచి అన్నది ఇంకా ఫైనల్ చేసుకోలేదని వెల్లడించారు. తాజాగా టీజేఎస్ పోటీలో ఉంటుందని ప్రకటించడంతో.. మునుగోడులో గద్దర్ ను పోటీలో ఉంటే ప్రయత్నాల్లో కోదండరామ్ ఉన్నారని అంటున్నారు. అటు బీఎస్పీ కూడా గద్దర్ కు ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది.


మునుగోడులో బీసీ వాదం బలంగా ఉంది. నియోజకవర్గంలో దాదాపు 67 శాతం మంది బీసీ ఓటర్లున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మరో 20 శాతానికి పైగా ఉన్నారు. అంటే దాదాపు 90 శాతం ఓటర్లు బడుగు, బలహీన వర్గాల నుంచి ఉండగా.. మూడు ప్రధాన పార్టీలు రెడ్డి అభ్యర్థులనే బరిలోకి దింపాయి. దీంతో బీసీ, ఎస్టీ, ఎస్టీ వర్గాల్లో అసంతృప్తి ఉంది. దీన్ని క్యాష్ చేసుకునే ఎత్తుగడలో భాగంగా గద్దర్ ను మునుగోడు బరిలో దింపాలని కోదండరామ్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కోదండరామ్ పార్టీ పోటీతో మునుగోడులో ఎవరికి లాభం, ఎవరికి నష్టం  అన్న చర్చ కూడా సాగుతోంది. టీజేఎస్ తో మిగితా పార్టీల కంటే తమకు నష్టం కల్గుతుందని కాంగ్రెస్ కలవరపడుతోంది. అటు బీజేపీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అధికార పార్టీకి లాభమనే అభిప్రాయంతో ఉంది. మొత్తంగా టీజేఎస్ పార్టీ పోటీతో మునుగోడు ఉపసమరంలో రాజకీయ సమీకరణలు మారిపోతాయనే చర్చ జరుగుతుంది.


Read also: The Razakar Files: శరవేగంగా రజాకార్ సినిమా షూటింగ్.. తెలంగాణలో రచ్చరచ్చేనా?


Read also: Godfather Collections: గాడ్ ఫాదర్ సినిమా జోరు.. మూడో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook